మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్​ఎస్ పోటీ.. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు!​

దేశ రాజకీయాలను శాసించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మలిచారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​ రావు. వచ్చే ఎన్నికల్లోపు దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసి తమ అస్థిత్వాన్ని చాటేందుకు పలు ప్రయత్నాన్ని కూడా మొదలు పెట్టారు పార్టీ నాయకులు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా కవిత చేసిన కీలక వ్యాఖ్యలు వచ్చే మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పోటీ పడనుందనే వాదనకు తెరలేపాయి.

మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ కీలక భాగస్వామి అవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మహారాష్ట్ర ప్రజల కోసం తాము పని చేస్తామని కవిత ప్రకటించారు. ముంబైలో పర్యటించిన కవిత.. ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మహారాష్ట్ర సాంస్కృతిక సంగీతం, డోలు చప్పుళ్లతో కవితకు స్వాగతం పలికారు. అనతరం మాట్లాడిన కవిత.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువ చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణతో దాదాపు 1000 కిలోమీటర్ల మేర సరిహద్దును మహారాష్ట్ర పంచుకుంటుందన్న కవిత.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ పార్టీని మహారాష్ట్రలో కూడా విస్తరించి తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇక్కడ కూడా చేయాలని మరాఠా ప్రజల నుంచి గత కొన్ని సంవత్సరాలుగా విజ్ఞప్తులు వస్తున్నాయని కవిత పేర్కొన్నారు.

దేశంలో ఇప్పటివరకు విద్యుత్, తాగునీరు, సాగునీరు అందించడం వంటి కనీస సదుపాయాలను ఎవరు కల్పించలేదని.. కానీ తెలంగాణలో మాత్రం 98 శాతం సదుపాయాల కల్పనను పూర్తి చేశామన్నారు కవిత. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రమే ఇంత చేస్తే.. దేశవ్యాప్తంగా ఎందుకు చేయలేరని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఎన్నికల్లో పోటీ విషయంపై పార్టీ అధిష్ఠానం ప్రకటన చేస్తుందని కవిత తెలిపారు. మహారాష్ట్ర ప్రగతిశీల అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం అవుతుందని ప్రకటన చేశారు. శివాజీ, అంబేడ్కర్‌తో పాటు అనేక మంది మహానుభావుల స్ఫూర్తితో తాము ప్రజల కోసం పని చేస్తామన్నారు కవిత.

ముంబైలో రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే మంచి నీరు సరఫరా అవుతుందన్న కవిత.. హైదరాబాద్‌లో మాత్రం 24 గంటల పాటు నల్ల ద్వారా ఇంటింటికి మంచి నీరు అందుతుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేసినప్పుడు మహారాష్ట్రలో ఎందుకు చేయలేరని కవిత ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *