సికింద్రాబాద్​లో ప్రైవేట్ బస్సు బీభత్సం.. యువకుడు మృతి!

ఎప్పుడూ రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్​ దగ్గర్లో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో మూడు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు స్వల్ప గాయాలై ప్రాణాలతో బయటపడగా… ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. యువకుడికి హెల్మెట్ లేకపోవడంతో తలకు బలంగా గాయమై అక్కడికక్కడే మరణించాడు. మిగతా ముగ్గురు హెల్మెట్ పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సికింద్రాబాద్‌లోని వైఎంసీఏ వద్ద ఆదివారం రాత్రి సమయంలో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. రెడ్ సిగ్నల్ పడినా కూడా ఆగకుండా.. ఆగి ఉన్న వాహనాల మీది నుంచి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సందీప్ అనే యువకుడు ఈ ఘటనలో మృతి చెందాడు. ఇతనికి సంవత్సరం క్రితమే వివాహం అయ్యింది. పుట్టింట్లో ఉన్న తన భార్యను తీసుకొని హకీంపేటలో ఉన్న స్వగృహనికి వెళ్తుండగా.. బస్సు వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో బండిపైన ఉన్న సందీప్ భార్య బస్సుకు మరోవైపు పడిపోగా… సందీప్ బస్సు టైర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.
వెంటనే స్పందించిన స్థానికులు బస్సును అడ్డగించి.. డ్రైవర్ మహేష్‌ను కిందికి దింపి చితకబాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న గోపాలపురం పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకునేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దీంతో ప్రైవేట్ బస్ డ్రైవర్ మహేష్ అతి వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉంటే.. బస్సు డ్రైవర్ మహేష్ మాత్రం బస్సు బ్రేక్ ఫెయిల్ అయినట్లుగా వెల్లడించాడు. అయితే బస్సు బ్రేక్ నిజంగానే ఫెయిల్ అయిందా.. లేక అతను అబద్ధం చెప్తున్నాడా అనే విషయంపై టెక్నికల్ టీంతో కలిసి గోపాలపురం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ పుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *